ఈ టాలీవుడ్ స్టార్స్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో రాణించకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?
సినీ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం ఏనాటి నుంచో వస్తోంది. అయితే అందరూ సక్సెస్ కాలేరు. కొందరే నిలదొక్కుకుంటారు. చాలామంది రాణించలేక చతికిలబడ్డారు. అలాంటి వాళ్ళు ఎవరో చూద్దాం. బాక్సాఫీస్ ని సయితం షేక్ చేసినవాళ్లు కూడా రాజకీయాల్లో తేలిపోయారు. అయితే కొందరు సినిమాలకు తిరిగొస్తే, కొందరు అటు ఇటు కాకుండా కనుమరుగైన వాళ్ళున్నారు. తెలుగునాట సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రభంజనం సృష్టించిన హీరోల్లో అలనాటి అగ్ర హీరో ఎన్టీఆర్ ఒక్కరే అని చెప్పాలి. రాజకీయ పార్టీ పెట్టి, 9నెలల్లో అధికారం దక్కించుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్. దేవుడంటే ఇలానే ఉంటాడనే రీతిలో రాముడు,కృష్ణుడుగా మెప్పించిన ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, కాంగ్రెస్ ని గద్దెదించి సీఎం అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సైతం సత్తా చాటిన ఎన్టీఆర్ చివరి రోజుల్లో దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు.
ఇక హీరోయిన్ గా తెలుగు , తమిళ భాషల్లో తనదైన ముద్ర వేసిన జయలలిత రాజకీయాల్లో హీరోలకు ధీటుగా వ్యవహరించి తన సత్తా చాటారు. తమిళనాడు సీఎం గా ఐదుసార్లు పనిచేసిన ఘనత సాధించారు. సీఎం పదవిలో ఉండగానే అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగులో ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి,అధికారం సాధించాలని ప్రయత్నం చేసినా, సాధ్యం కాలేదు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి,చంద్రబాబు ల ధాటికి తట్టుకోలేక మూడవ స్థానికి పరిమితం అయిన చిరంజీవి ఆతరవాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. కేంద్రమంత్రిగా పనిచేసి,ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా ఉన్నారు. రాజకీయాలు ఊసెత్తడం లేదు.
లేడి అమితాబ్ గా పేరొందిన విజయశాంతి సొంతంగా పార్టీ పెట్టి, ఆతర్వాత టి ఆర్ ఎస్ లో చేరి ఎంపీగా గెలిచి,ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ లో చేరి ,ఇటీవల ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేసారు. ఐతే ప్రజాకూటమి ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు.
ఇక దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి, రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తూ , కేంద్ర మంత్రి అయ్యారు. అయితే బొగ్గు స్కామ్ లో ఇరుక్కుని ఇమేజ్ డామేజ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ ప్రచారంలో పాల్గొంటూ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలిటిక్స్ లో తన ఇమేజ్ పదిలపరచుకోవడంలో సక్సెస్ కాలేదు.
సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున 1989లో ఎంపీగా గెలవగా, అలనాటి హీరోయిన్ జమున రాజమండ్రి నుంచి అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 1991మధ్యంతర ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందారు. ఇక కృష్ణంరాజు కాకినాడ నుంచి,నరసాపురం నుంచి గెలిచి కేంద్రం లో రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేసారు. ప్రజారాజ్యం తరపున రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.
ఇక నటుడు మురళీ మోహన్ రాజమండ్రి ఎంపీగా టిడిపి నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టిడిపి తరపున రాజ్యసభ సభ్యునిగా పనిచేయగా,నటుడు కైకాల సత్యనారాయణ బందరు నుంచి టిడిపి ఎంపీగా,అలాగే నటి శారద టిడిపి చీరాల ఎంపీగా ఒకసారి పనిచేసారు.
కోట శ్రీనివాసరావు బిజెపి నుంచి విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు బాపట్ల నుంచి టిడిపి ఎంపీగా ఒక దఫా గెలిచారు.
హీరోయిన్స్ జయప్రద,జయసుధ పొలిటికల్ గా ఓ వెలుగు వెలిగారు. జయప్రద టిడిపి తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించగా, ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచింది. బాబుమోహన్ టిడిపి ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేసారు.
నటి రోజా టిడిపిలో కీలక పాత్ర పోషించి,ప్రస్తుతం వైస్సార్ సిపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అయ్యారు. అయినా టిడిపికి ముచ్చెమటలు పోయిస్తూ తనపంధాలో పోతోంది.
ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్రంలో అధికార తెలుగుదేశం,ప్రధాన ప్రతిపక్షం వైస్సార్ సిపి లకు ధీటుగా జనసేన పార్టీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నాడు. నిజానికి 2014ఎన్నికల సమయంలోనే జనసేన పెట్టినా,తెలుగుదేశం – బిజెపిలకు సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఒంటరిగా బరిలో నిలవబోతున్నాడు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు.