మెడ నొప్పులు మాయం కావాలంటే….మకరాసనం
మెడనొప్పులతో బాధ పడేవారు మకరాసనం వేయడంవల్ల చాలా ఉపశమనం కలుగుతుంది . ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారికి ఎక్కువగా మెడనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ ఆసనం వేస్తె చాలా మంచిది. మకరాసనం అంటే… ముందుగా మకరం అంటే మొసలి అని అర్థం కదా.. ఈ ఆసనం కూడా మొసలి రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి మకరాసనం అని పేరు వచ్చింది. దీనికే “నిరాలంబాసనం” అనే మరో పేరు కూడా ఉంది.
ఈ ఆసనం ఎలా వేయాలంటే… ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే, రెండు మోచేతులను జోడించి నేలపైన ఉంచి… శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనసు నిలపాలి.
అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి, మోకాళ్లను చాపి ఉంచాలి, మడవవద్దు. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి, కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది, శరీరమంతా శీతలీకరణం చెందుతుంది.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే… అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆసనాన్ని వేయకూడదు. మిగిలినవారు ప్రతిరోజూ ఈ ఆసనాన్ని వేయడం వల్ల మెడనొప్పుల నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండవచ్చు.