కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసా?
సాధారణంగా మనం ఇంటిలో నోములు,వ్రతాలు,పూజలు చేసే సమయంలో కలశం మీద కొబ్బరికాయను పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. కలశం కోసం రాగిచెంబు లేదా వెండి చెంబును తీసుకోని దానికి పసుపు,కుంకుమ రాయాలి. కలశంలో కొంచెం నీటిని పోసి, అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయ చుట్టూ ఒక వస్త్రాన్ని చుడతారు. ఇక పూజ అయ్యిపోయాక కలశంలో కొబ్బరికాయను ఏమి చేయాలా అనే సందేహం రావటం సహజమే.
కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చునని, ఒక వేళ అది వీలు కాకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు – వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా వారికి ఇవవచ్చు. ఇలా ఇవ్వటం వలన ఎలాంటి దోషము ఉండదని పండితులు అంటున్నారు. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను ‘పూర్ణాహుతి’కి వాడుతుంటారు.