కుప్పం ఎన్నికపై జోరుగా బెట్టింగ్స్ ….పరిస్థితి ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం అవుతారా లేదా ఒకవేళ వైసిపి అధినేత జగన్ సీఎం అవుతారా అనే విషయం తేలాలంటే,ఇంకా నెల రోజులకు పైగా ఎదురు చూడక తప్పదు. అయితే ఏపీలో ఈ సారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, టీడీపీ పరిస్థితి ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కీలకమైన కుప్పంలో ఈ సారి చంద్రబాబు పరిస్థితి ఏమిటనే అంశంపై కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని ఎవరూ ఊహించలేరు. అది సాధ్యమవుతుందని వైసీపీ కూడా భావించడం లేదు.
అయితే చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంత మేరకు తగ్గించాలన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకోసం వైసీపీ అనేక ఎత్తులు వేసిందని ప్రచారం సాగించింది కూడా. 2009లో కుప్పంలో 70 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన చంద్రబాబు, 2014లో 47 వేల మెజార్టీ సాధించారు. దీంతో ఈ సారి టీడీపీ అధినేతకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందనే అంశంపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి నెల రోజులకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లను ఆకర్షించేందుకు బుకీలు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు మెజార్టీపై పందెం రాయుళ్లను బుకీలు ఊరిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. చంద్రబాబు మెజార్టీ ఈ సారి గతం కంటే పెరుగుతుందా ? లేక తగ్గుతుందా ? అనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే చాలామంది ఈ సారి చంద్రబాబు మెజార్టీ గతంతో పోలిస్తే తగ్గుతుందని పందేలు కాస్తున్నట్టు వినిపిస్తోంది. ఇంకా చాలా చోట్ల పందేల జోరు భారీగానే ఉంది. కోసు(ఎదుటివాళ్ళ కంటే డబుల్) పందాలు కూడా కాస్తున్నట్లు తెలుస్తోంది.