Movies

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధం అవుతుందా…రిస్క్ చేస్తున్నారా…?

అక్కినేని నట వంశం నుంచి వచ్చిన నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తాజాగా రూపొందుతుంది. నిజానికి అఖిల్ తన పేరునే సినిమాగా ఎంట్రీ ఇస్తూ, ఇప్పటిదాకా మూడు సినిమాలు చేసినా ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలో హిట్ అందుకోలేదు. ఇప్పుడు కసిగా నాలుగో సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ తో పాటూ అక్కినేని ఫాన్స్ ఆశలు హై రేంజ్ లో ఉన్నాయి. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పూర్తి ఫన్ తో ఎమోషన్స్ తో ఈ సినిమా రూపొందించారని చెప్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తాడట. గీత గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కరోనా కోరల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేసింది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పూర్తయిపోయి, విడుదలకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేనందున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా యూనిట్.. ఓటిటిలో విడుదల చేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ సినిమా విడుదల పై యూనిట్ స్పందించి ఈ సినిమా ఎంత ఆలస్యం అయినా సరే, థియేటర్లోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. దీనిపై క్లారిటీ రావాలి.