Business

Andhra Pradesh Rains: రానున్న మూడు రోజులు వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ, రాబోయే రెండు రోజుల్లో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వైపు సాగనుందని పేర్కొంది. ఈ అల్పపీడనంతో పాటు ద్రోణి కొనసాగుతుండగా, దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉత్తర కోస్తా, యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే సంకేతాలు ఉన్నాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండటం, తీరంలో బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. మంగళవారం (జూలై 8) గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ, జూన్‌లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటుగా నమోదైంది. అయితే, జూలైలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాయలసీమలో సాధారణ వర్షపాతం, దక్షిణ కోస్తాలో సాధారణం నుండి అధిక వర్షపాతం, ఉత్తర కోస్తాలో సాధారణం నుండి తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది.