Vinayaka Chavithi 2025 వినాయక చవితి రోజు తమలపాకు+సింధూరంతో ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోయి విజయం లభిస్తుంది..
Vinayaka Chavithi 2025 వినాయక చవితి రోజు తమలపాకు+సింధూరంతో ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోయి విజయం లభిస్తుంది.. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి గణేష్ చతుర్థి అనంత చతుర్దశి వరకు జరుపుకోవడం ఆనవాయితీ.

అలాగే, భాద్రపద మాసం ముగిసే వరకు చాలా మంది విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. ఈ మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ వినాయకుడిని ఆరాధిస్తే విఘ్నాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2025 ఆగస్టు 27, బుధవారం నాడు వినాయక చవితి జరుపుకోనున్నారు.

వినాయకుడికి సింధూరం సమర్పణ
వినాయక చవితి రోజున గణపతికి సింధూరం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. సింధూరం వినాయకుడికి ఎంతో ఇష్టమైనదిగా నమ్ముతారు. ఈ సమర్పణ వల్ల కష్టాలు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి ఈ పద్ధతి మేలు చేస్తుందని చెబుతారు. విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి, సింధూరం సమర్పణ ద్వారా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే, గణపతి జ్ఞానానికి ప్రతీక కాబట్టి, సింధూరం సమర్పించి పూజించడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుందని ఆచారం.

సింధూరం సమర్పణ పద్ధతి
వినాయకుడికి సింధూరం సమర్పించే ముందు గణపతి విగ్రహాన్ని పసుపు, గంధం, కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత సింధూరం సమర్పించి, ధూపం, దీపం, నైవేద్యం అర్పించాలి. అనంతరం హారతి ఇచ్చి, నమస్కరిస్తూ మనసులోని కోరికలను వినాయకుడికి విన్నవించాలి. ఈ విధంగా చేయడం వల్ల సంతోషం, అదృష్టం, శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

తమలపాకుల సమర్పణ
గణేష్ చతుర్థి రోజున వినాయకుడికి సింధూరంతో పాటు తమలపాకులు సమర్పించడం కూడా ముఖ్యమైన ఆచారం. తమలపాకులు, వక్కలు, వక్కపొడి, సున్నం కలిపి తాంబూలంగా నైవేద్యం సమర్పించడం విశేషంగా భావిస్తారు. ఈ విధంగా తమలపాకులు సమర్పించడం వల్ల పనులలో ఆటంకాలు తొలగి, గణపతి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వినాయక చవితి రోజు సమర్పించే 21 రకాల పత్రాల్లో తమలపాకులు కూడా ఉంటాయి. తమలపాకులతో తాంబూలం సమర్పిస్తే పూజ సంపూర్ణతను పొందుతుందని విశ్వాసం.

హిజ్రాలకు దానం
వినాయక చవితి రోజున హిజ్రాలకు డబ్బు దానం చేసి, వారి నుంచి కొంత చిల్లర తీసుకొని ఇంట్లో పూజా మందిరంలో ఉంచితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే, హిజ్రాలకు డబ్బుతో పాటు భోజనం, వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా వినాయకుడి ఆశీస్సులు పొందవచ్చని, విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి కొన్ని శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియ జేయబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ విషయాలను ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సమయం తెలుగు ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.

