TTD Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్లపై కీలక అప్ డేట్.. జారీ విధానంలో మార్పులు..
TTD Srivani Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి టిక్కెట్ల జారీ విధానంలో సవరణలు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం, రోజుకు 500 టిక్కెట్లను ఆన్లైన్లో, మరో 1,000 టిక్కెట్లను ఆఫ్లైన్లో జారీ చేస్తోంది. అయితే, భవిష్యత్తులో అన్ని టిక్కెట్లను పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం, ఆన్లైన్లో భక్తులు మూడు నెలల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కానీ, ఆఫ్లైన్ టిక్కెట్లు ఆ రోజుకు ఆ రోజే జారీ చేస్తున్నారు. దీంతో, ఆఫ్లైన్ కోటాకు భారీ డిమాండ్ ఏర్పడి, భక్తులు గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఆఫ్లైన్ కోటాను కూడా ఆన్లైన్లో అదే రోజు జారీ చేసే విధానాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. ఈ అంశంపై భక్తుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.

