రిపబ్లిక్ డే ఎలా ప్రారంభం అయిందో తెలుసా?
మనము ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవము (Republic Day) జరుపు కుంటాము . ఇది దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్ రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగమూ తయారైనది , అలా తయారయిన రాజ్యాంగము ఎప్పుదో ఒకప్పుడు మొదలిపెట్టాలి కదా, మనము అలా మొదలు పెట్టిన రోజే .. 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరము జనవరి 26 న పండగ జరుపుకుంటున్నాము .
మనకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి , ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని 2 (రెండు)సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు. ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటినుండి భారతదేశము ” సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది.

