Business

లలిత జ్యూవెలర్స్‌ ఓనర్‌ తల్లి ఆ రోజు అలా చేయకపోతే ఏమయ్యేదో తెలుసా? నమ్మలేని నిజాలు

ఏదైనా వ్యాపారం ముందుకెళ్లాలంటే,పబ్లిసిటీ కావాలి. వాళ్ళ వస్తువులకు మార్కెట్ లో గిరాకీ వచ్చేలా యాడ్స్ ఉండాలి. అయితే కొన్ని యాడ్స్ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన యాడ్ ఆమధ్య టీవీల్లో ఊదరగొట్టేసేది. అందులో మోడల్స్‌ ఉండరు, అందాల ముద్దుగుమ్మలు అసలు ఆ యాడ్స్‌లో కనిపించరు. మోడల్స్‌ అందులో కనిపించకున్నా కూడా ఆ యాడ్‌ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అదే లలిత జ్యూవెలరీ యాడ్‌. కంపెనీ ఓనర్ స్వయంగా తమ ప్రోడక్ట్స్ గురించి చెబుతూ బాగా ఆకట్టుకున్నాడు. సాధారణంగా టీవీల్లో ఎన్నో కంపెనీలకు, ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలకు, లలిత జ్యూవెలరీ యాడ్‌ చాలా భిన్నంగా కనిపించేది. లలిత జ్యూవెలర్స్‌ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఓనర్ కిరణ్‌ కుమార్‌ మారిపోయారు. నా కంపెనీకి నేనే అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని మొదలు పెట్టి, అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిజానికి కిరణ్‌ కుమార్‌ ఓ బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్‌ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. నున్నటి గుండుతో కనిపించే కిరణ్ కుమార్ మాట తీరును చూసి, ఆయన తెలుగు వ్యక్తి కాదని చాలామంది అనుకునేవారు. కాని ఆయన పక్కా తెలుగు వాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త తగ్గరగా ఉండటం వల్ల భాష – యాసలో కాస్త తేడా ఉంటుంది. బంగారం షాపులు పనిచేస్తున్నప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది.

తానే సొంతంగా బంగారు వస్తువులు తయారు చేసి అమ్మితే మంచిదేమో అని భావించి, అనుకున్నదే తడువుగా అమ్మ చేతికి ఉన్న గాజులను ఆమెను ఒప్పించి తీసుకున్నాడు. కొడుకుపై నమ్మకంతో ఆ తల్లి తన బంగారు గాజులు ఇచ్చింది. ఆ బంగారు గాజులను కరుగబోసి కొన్ని చిన్న వస్తువులను చేశాడు. ఆ వస్తువులను చెన్నైకి తీసుకు వెళ్లి అమ్మడం ద్వారా మంచి డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి మళ్లీ వస్తువులు తయారు చేయడం, అమ్మడం , అలా చేస్తుండేవాడు. మంచి లాభసాటి గా మారింది.

కిరణ్‌ కుమార్‌ తాను తయారు చేసిన బంగారు వస్తువులను ఎక్కువగా చెన్నైలోని లలిత జ్యూవెలర్స్‌కు విక్రయించేవాడు. కిరణ్ కుమార్ వస్తువులు వాళ్లకి బాగా అమ్ముడుపోవడంతో గురికుదిరింది. ఇలా కొన్ని రోజుల తర్వాత షాప్‌ యజమాని అనివార్య కారణాల వలన షాప్‌ అమ్మకానికి పెట్టాడు. అయితే ఇదే అదనుగా భావించిన కిరణ్ కుమార్ కాస్తంత రిస్క్ చేసాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు మరికొంత పోగేసి ఆ షాప్ కొనుగోలు చేశాడు. అలా లలిత జ్యూవెలర్స్‌ను కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా లాభాల బాట పట్టేసింది.

పలుచోట్ల బ్రాంచీలు కూడా పెట్టేసాడు. ఇలా విస్తరించిన లలిత జ్యూవెలర్స్‌ ప్రస్తుతం ఏడాదికి 11 వేల కోట్ల టర్నోవర్‌తో రన్‌ అవుతోంది. తల్లి గాజులు అమ్మేసిన పరిస్థితి నుండి వేల కోట్ల బిజినెస్‌ను విస్థరించిన కిరణ్‌ కుమార్‌ జీవితం దశతిరిగింది. దానికి తోడు కష్టపడి, నమ్మకంతో పని చేసి, ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. అదృష్టం కూడా కలసివచ్చింది. అందుకే ఔత్సాహిక వ్యాపార,పారిశ్రామిక వేత్తలకు కిరణ్ కుమార్ ఆదర్శనీయుడని పలువురు కొనియాడుతుంటారు.