Movies

రోజా బాటలో నాగబాబు….???

ఏ రంగమైనా అంత ఈజీకాదు. అందునా రాజకీయాల్లో రాణించడం మరీనూ. కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగి, ఆ తర్వాత ప్రజల్లో ఉంటేనే వారి ఆదరణ దక్కుతుందనే విషయాన్ని చాలామంది నిరూపించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటే మాత్రం రాజకీయాల్లో రాణించే ఛాన్స్ బానే ఉంటుంది. తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా ఇదే బాటలో నడవాలని భావిస్తున్నారట. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాగబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి మాత్రం చివర్లో ఎంట్రీ ఇస్తూనే నరసాపురం ఎంపీగా పోటీ కి దిగారు. 

పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తుండటంతో, నరసాపురం ఎంపీగా నాగబాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాను గెలుస్తానా ? లేదా అనే అంశంతో సంబంధం లేకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలని నాగబాబు బలంగా నిర్ణయించుకున్నారట. అందుకే బుల్లితెరపై తాను జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాజకీయాల్లో కొనసాగాలని ఆయన డిసైడయ్యారని టాక్. ఈ విషయంలో రోజా బాట కరెక్ట్ అని నాగబాబు చెబుతన్నారట. రోజా గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో కనిపించి సందడి చేశారు.

జనం నోళ్లలో ఆమె నానడానికి ఈ బుల్లితెర కార్యక్రమాలు బాగా ఉపయోగపడ్డాయనే వాదన కూడా ఎక్కువగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో నాగబాబు కూడా ఇదే రకంగా ముందుకు సాగాలని అనుకుంటున్నారట. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఈ అంశంపై ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని జనసేన వర్గాల కథనం. రాజకీయాల్లో ఉంటున్న నేతలకు కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు మద్దతు అవసరమని, అందుకే ఈ విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉండాలని నాగబాబు భావిస్తున్నారట.