డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.
ఎంఎన్ రాయ్ మాటల్లో చెబితే.. భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో!