Movies

ఆ రెండు అంశాలే సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి !

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు నెలల నుండి ప్రధానంగా వినిపిస్తోన్న సమస్యలు ఒకటి ఇసుక, మరొకటి ఆర్టీసీ సమ్మె. పాత సామెత ‘ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది’ అన్నట్లు.. ఇప్పుడు ఈ రెండు సమస్యలూ.. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద గుదిబండలా మారి, సినిమాలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయి. ఏపీలో ఇసుక దొరకడం గగనమైపోయింది. దీంతో ఇసుకతో ముడి పడి సాగుతున్న వివిధ రంగాలు.. ముఖ్యంగా భవనాలు నిర్మాణ కార్మికులు, కూలీలు దగ్గరనుంచీ.. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు ఇలా నిర్మాణ అనుబంధ రంగాల పై బతుకున్న లక్షలాది మంది కార్మికులకు పనులు లేక, సరైన ఆదాయం లేక అత్యంత ఇబ్బందికర పరిస్థితులతో అల్లాడిపోతున్నారు.

దయనీయంగా మారిన వారి జీవితాల ప్రభావం, సినిమాల పై బాగా పడుతుంది. ఏపీలోని బిసి సెంటర్ల రెగ్యులర్ ఆడియన్స్ అందరూ.. ఇలా ఆర్ధిక ఇబ్బందులతో థియేటర్స్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. దాంతో పాజిటివ్ టాక్ వచ్చిన ‘ఖైదీ’ లాంటి సినిమాలు, అలాగే ప్రత్యేకంగా బిసి ఆడియన్స్ కోసమే తీసిన ‘తెనాలి రామకృష్ణ’ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేస్తున్నాయి. కలెక్షన్స్ రాబట్టలేక నష్టాల బాట పడుతున్నాయి.

ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె కూడా సినిమాల పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఆటో వాళ్ళు చార్జీ రేట్లను అమాంతం పెంచేయడం.. ఇక మెట్రో సామాన్య ప్రజానానికి అందుబాటులో లేకపోవడం, పైగా థియేటర్స్ అన్ని దూరందూరంగా ఉండటంతో.. దిగువ స్థాయి ప్రేక్షకులకు సినిమాలు చూడాలనే ఆలోచన కూడా కలగడం లేదు. మొత్తానికి ఏపీలో ‘ఇసుక’ మరియు తెలంగాణలో ‘ఆర్టీసీ సమ్మె’ కారణంగా.. ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు రెవిన్యూ పరంగా డిజాస్టర్‌లుగా మారుతున్నాయి.

మరి ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం పోటీ పడి మరి విడుదలవుతున్న సినిమాల కలెక్షన్స్ ఘోరంగా పడి పోకుండా ఉండాలంటే.. కనీసం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలైనా బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవాలంటే.. సినిమాలను రెగ్యులర్ గా చూసే మాస్ ప్రేక్షకుల జీవన ఆర్ధిక స్థితిగతులు త్వరగా మెరుగుపడాలి.