Devotional

రేపు డిసెంబర్ 29 కాలభైరవాష్టమి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు 7 జన్మల పాపాలు,గ్రహ బాధలు,అపమృత్యు దోషాలు తొలగిపోతాయి

మార్గశిర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి. సృష్టికి లయకారుడు అయిన పరమేశ్వరుడు కారణంగా ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు – కాలభైరవుడు. కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించాలని శాస్త్రం చెప్పుతుంది.
కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉండుటవలన కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి, నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని… గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

కాలభైరవుడు ఆవిర్భావానికి ఒక కథ ఉంది. ఈ ఆసక్తికరమైన కథ శివ పురాణంలో ఉంది. సృష్టి ప్రారంభంలో శివునికి,బ్రహ్మ దేవునికి ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి – ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదోపవాదాలు చాలా సేపు జరిగాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మధ్య ఉన్న ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. అప్పుడు శివుడు కోపంతో హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. భయంకరమైన రూపం శ్రీకాలభైరవుడు.

ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా యిచ్చాడు.

బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు… కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహా యిచ్చాడు.దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు.

బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే – నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ… కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ… సర్వవిధాలైన భయాలు నశిస్తాయి.

కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, మినపవడలను నైవేద్యంగా సమర్పించవలెను. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.