అందరి చూపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పైనే – వర్మ అంచనాలను అందుకున్నాడా?
ఎన్నికల వేళ పొలిటికల్ వేడి పెంచే సినిమాలు రావడం కొత్తకాదు. అయితే ఒక కీలక సంఘటన ఆధారంగా సినిమా రావడం ఇదే. అవును ఎన్టీఆర్ బయోపిక్ పేరిట కథానాయకుడు,మహానాయకుడు అనే రెండు భాగాలు ఇప్పటికే విడుదలై డిజాస్టర్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ జీవితంలో ఆఖరి ఘటనలను చూపిస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటిస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన నాటినుంచి అందరి చూపులు ఆ సినిమాపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే విషయం పక్కన బెడితే ముందు ఇందులో ఏముంది అని చూడ్డానికైనా అంతా వెయిట్ చేస్తున్నారు.
ఇక ‘ఈ సినిమాలో అన్నీ నిజాలే ఉంటాయి.. నా కెరీర్ మొత్తంలో నేను చేసిన గౌరవప్రదమైన సినిమా ఇదొక్కటే.. ఇది తెరకెక్కించిన తర్వాత నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది’అని వర్మ చెప్పడం కూడా సినిమాపై ఆసక్తి మరింత పెంచేసింది. కచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే కాదు.. అందరి మన్ననలు అందుకుంటుందని వర్మ ధీమాగా చెబుతున్నాడు. ఈ చిత్రంతో వర్మ ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో..
అసలు ఈ చిత్రం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపించబోతుందో అనే టాక్ కూడా నడుస్తోంది. మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఈ చిత్రంలో ఉన్నవన్నీ అబద్ధాలే అంటూ కొట్టి పారేస్తున్నారు.ఇందులో వర్మ నిజాలు చూపించే దమ్ము లేదని.. ఉన్నవి లేనివి కలిపి చూపిస్తున్నాడు.. జగన్ పార్టీకి అమ్ముడై అబద్ధాలు చూపిస్తున్నాడంటూ వర్మ పై తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇంకా పెరిగిపోయింది.