Devotional

జనవరి 15న మకర జ్యోతి దర్శనం.. శబరిమల దేవస్థానం ప్రకటన

మండల పూజలు ముగియడంతో శుక్రవారం మూసుకున్న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సోమవారం సాయంత్రం తిరిగి తెరవనున్నారు. మకరు విళక్కు పూజల కోసం సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి సన్నిధానం తెరుచుకోనుంది. డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. అనంతరం జనవరి 21న పడిపూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే, ఈ ఏడాది మకరజ్యోతి జనవరి 15న దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రాంత్రి జనవరి 15న కాబట్టి, అదే రోజు మకరజ్యోతి దర్శనం ఇస్తుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మకరు విలక్కు తర్వాత ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని పేర్కొంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆందోళనలు, నిరసనల కారణంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఆదాయానికి గండిపడింది. అయితే, ఈ ఏడాది మాత్రం కేరళ ప్రభుత్వం వెనక్కుతగ్గడంతో సన్నిధానంలో ప్రశాంతత నెలకుంది.

10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించబోమని, వారికి ఎలాంటి భద్రత కల్పించలేమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున గతేడాది తీర్పును అమలుచేయబోమని స్పష్టం చేసింది. దీంతో సన్నిధానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.