సౌందర్య ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?
Tollywood Heroine soundarya :ఫలానా హీరోయిన్ నటన చూసాక పాతవాళ్ళు గుర్తొచ్చి వాళ్లతో పోలుస్తుంటారు. మహానటి సావిత్రి తర్వాత వాణిశ్రీకి అంతటి పేరు వచ్చింది. వాణిశ్రీని అభినవ సావిత్రి అనేవారు. అలాగే ఆతరువాత తరంలో అమ్మోరు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సౌందర్యను కూడా అభినవ సావిత్రి గా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. కన్నడ కస్తూరి అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అని ఎక్స్పోజింగ్కు ఏమాత్రం సౌందర్య అంగీకరించలేదు. అలాంటి సీన్స్ కి దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్గా తుదివరకూ వరకు నిల్చింది.
కెరీర్ చివర్లో కూడా సంచలన సినిమాలు చేయడమే కాదు, తన సోదరుడు అమరనాథ్ సహకారంతో కర్ణాటకలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. మెడికల్ కాలేజ్తో పాటు స్కూల్స్ కూడా కట్టించి ఉచిత విద్యను అందించింది. అంతేకాదు,ఇప్పటికీ ఆ స్కూల్స్కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తుంది. అప్పటి లెక్కల ప్రకారమే 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. ఈమె ఆస్తులు,ఇళ్ల గురించి ఆమె ప్రాణ స్నేహితురాలు ఆమని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేక పోయానని.. అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు చెప్పింది. ఆమె బతికున్నపుడు దేధీప్యమానంగా వెలిగిన బంగ్లాను ఆ మధ్య వెళ్లి చూస్తే అక్కడెవరూ లేరని, చివరికి సౌందర్య తల్లి కూడా అక్కడ లేదని, ఆ ఇల్లు బూత్ బంగ్లాలా మారిపోయిందని ఆమని వివరిస్తూ కంటతడి పెట్టుకుంది.
అగ్ర హీరోలందరి సరసన నటించిన సౌందర్య కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈలోకం నుంచి నిష్క్రమించింది. అదికూడా 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కావడం, పైగా పెళ్లై ఏడాది కూడా గడవకుండానే ఆమె మరణించడం అందరిని కలచివేసింది. ఇక ఆ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు కూడా ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. అయితే సౌందర్య నటించిన మూవీస్ దాదాపు హిట్ గా నిలిచాయి. తెలుగు,తమిళ,కన్నడ,హిందీ,మలయాళ భాషల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సొంతంచేసుకుంది. ఇప్పుడు ఆమె బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, అందులో ఆస్తి తగాదాలు కూడా ఉంటాయని టాక్. కీర్తి సురేష్, నిత్యామీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా కొందరు భౌతికంగా లేకున్నా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందులో సౌందర్య ఒకరు. అందుకే ఆమె గతించి 17ఏళ్ళు అయినా ఇంకా ఆమెను తలుచుకునే ఫాన్స్ చాలామంది ఉన్నారు.