Tirumala Update:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం… జూలై నెలలో తిరుమలలో రెండుసార్లు గరుడ వాహన సేవ.. తేదీలు,టైమింగ్..
Tirumala Update:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం… జూలై నెలలో తిరుమలలో రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ విషయమై తాజాగా టీటీడీ వివరాలను వెల్లడించింది.
జూలై నెలలో గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాల సందర్భంగా తిరుమలలో రెండుసార్లు గరుడ వాహన సేవ జరుగనుంది. జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సేవ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగనుందని టీటీడీ తెలిపింది.
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూలై 5 (శనివారం) నాడు 87,536 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.33 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ కొనసాగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పట్టినట్లు టీటీడీ తెలిపింది.
మరోవైపు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవిందరాజస్వామికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శతకలశ స్నపనం, మహాశాంతి హోమం నిర్వహించారు.
ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

