Politics

జనసేన లోకి చిరంజీవి ఎంట్రీ

మెగాస్టార్ జీవితంలో కీలకమైన మలుపు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. చిరు రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో కొంత మంది చిరంజీవి రాజకీయ జీవితం ముగిసిందని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని అంటున్నారు. జనసేన పార్టీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి జనసేనకు సలహాదారుగా ఉంటారని అంటున్నారు. చిరంజీవి సినిమాలకే పరిమితం అవుతారని ఇక రాజకీయాల వైపుకి రారని మరి కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇదే నిజమైతే పది సంవత్సరాల రాజకీయ జీవితానికి తెర పడినట్టే.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది ప్రజారాజ్యం పార్టీ. ఆ తర్వాత కొంతకాలానికే వివిధ పరిణామాల మధ్యన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేశారు.

2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహించారు.

అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది. 2104 లోక్ సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరు కావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన అక్బర్ రోడ్డు లోని బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరించినప్పుడు.. పట్టణాభివృద్ధి శాఖ నోటీసులతో బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది.

ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పురానా ఖిల్లా రోడ్డులోని ఏబీ-3 బంగ్లాను కేటాయించారు. ఇదిలా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఏపీకి చెందిన అన్ని పార్టీలు తిరుగుబాటు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా మీదేనని అంటుంటే..అదే పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం అసలు తనకు ఈ విషయంతో సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తుండటం అప్రతిష్ట మూటగట్టుకున్నారు.
Kalyan,Mega Star
గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందరో సీనియర్లు అయిన వయసు పైబడిన కేవీపీ లాంటి నేతలు సైతం ప్రత్యేక హోదా కోసం మేము సైతం అంటూ తమ వంతు తాముగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంటే ఎంతో జనాకర్షణ కలిగిన చిరంజీవి లాంటి వ్యక్తి సైలెంట్ గా ఉండిపోవడం ఏ రకంగా చూసినా సమంజసం కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
Pawan Kalyan,Chiranjeevi
రాజ్యసభ సమావేశాలకు ఏపీ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి డుమ్మా కొట్టారు. ఒకవేళ తాను రాజకీయాల నుంచి విరమించుకోదలిచిన ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీ నుంచి పదవిని అనుభవిస్తున్ననేతగా ప్రత్యేక హోదా విషయమై తన అభిప్రాయం ప్రకటించాల్సిన బాధ్యత తప్పకుండా చిరంజీవిపై ఉందంటూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. చిరంజీవి రాజకీయ ప్రయాణంలో మరో అంకం ఏ విధంగా ఉంటుందో అనే చర్చ కూడా సాగుతోంది.