ఈ ముద్దుగుమ్మల్లో నెంబర్ వన్ ఎవరో తెలుసా?
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అనగానే తమన్నా, సమంత, రకుల్, అనుష్క ఇలా చాలా పేర్లు పలికేవి. కానీ ఇప్పుడు వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నపుడు కచ్చితంగా వాళ్లంతా సైడ్ ఇవ్వాల్సిందే. అయినా కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు పోవాల్సిందే కదా. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నెంబర్ వన్ ఎవరనే చర్చ నడుస్తోంది. తాజాగా వస్తున్న హిట్స్ నేపధ్యంగా టాలీవుడ్లో కేవలం పూజాహెగ్డే, రష్మిక మందన్న ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య మాత్రమే అగ్రస్థానం కోసం యుద్ధం నెలకొంది. పైగా ఈ సంక్రాంతికి ఇద్దరూ హిట్ కొట్టారు. ఇప్పటికే పూజా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, టాప్ పొజిషన్కు వెళ్లగా, ప్రస్తుతం ఈమె ప్రభాస్, అఖిల్, జూనియర్ ఎన్టీఆర్ లతో చేస్తోంది.
సంక్రాంతికి బన్నీతో చేసిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడి రేంజ్ మరింత హెచ్చింది. పైగా అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో కూడా పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో వస్తున్న ఓ డియర్ సినిమాలో కూడా ఈమె విభిన్నమైన పాత్రలో నటిస్తోంది. ఇక రష్మిక మందన్న కూడా ఈ మధ్యే మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరుతో కమర్షియల్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో డాన్సులు కూడా అదరగొట్టింది. ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న భీష్మతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక కమిట్ అయింది.
అలాగే అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో ఈమె హీరోయిన్. ఇది హిట్టైతే రష్మిక రేంజ్ అమాంతం పెరిగిపోద్ది. రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు సినిమాలు చేస్తున్నా ,ఈ ఇద్దరు హీరోయిన్ల జోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే పూజా హెగ్డే అగ్ర పీఠానికి దగ్గరలో ఉండగా, రష్మిక కూడా అగ్ర పీఠం కోసం పూజాతో పోటీ సాగిస్తోంది. మరి ఎవరు నెంబర్ వన్ అవుతారో చూడాలి.