రాముడు రావణున్ని చంపాక శూర్పనకకు ఏమైందో తెలుసా..?
రామాయణం గురించి అందరికీ తెలుసు కదా.. అందులో శూర్పనక అనే పాత్ర ఉంటుంది, ఆమె గురించి అందరికీ తెలుసు. రామున్ని చూసి మోహించిన శూర్పనక ముక్కు చెవులను లక్ష్మణుడు కోసి పంపిస్తాడు. దీంతో శూర్పనక తనకు జరిగిన పరాభవాన్ని సోదరుడు రావణునికి చెబుతుంది. అయితే ఈమె కథ అక్కడితోనే అయిపోదు. ఇంకా ఉంటుంది. రామాయణంలో శూర్పనకకు అలా పరాభవం జరిగిన తరువాత చివరకు ఆమెకు ఏమవుతుంది ? అని ఎప్పుడూ ఎవరూ తెలుసుకోలేదు. అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణంలో రాముడు రావణున్ని సంహరించాక తిరిగి సీత, లక్ష్మణుడు, వానర సైన్యంతో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు కదా. అప్పుడు అయోధ్యను కొన్ని సంవత్సరాల పాటు రాముడు పాలిస్తాడు. అయితే సీత గర్భవతిగా ఉన్న సమయంలో బయట ప్రజలు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని రాముడు మళ్లీ సీతను అడవులకు పంపుతాడు. ఆ సమయంలో శూర్పనక అక్కడే తన అన్న రావణుడు ఇచ్చిన అరణ్యంలో నివాసం ఉంటుంది. అయితే సీత అరణ్యానికి వచ్చిందని, రాముడు ఆమెను వదిలించుకున్నాడని శూర్పనకు తెలుస్తుంది. దీంతో ఆమె సీతను చూసేందుకు ఆమె కుటీరానికి వెళ్తుంది.
సీత దగ్గరికి వెళ్లిన శూర్పనక సీతను ఉద్దేశించి.. చివరకు నీకూ ఒకప్పుడు నాకు పట్టిన గతే పట్టింది చూశావా..? రాముడు నిన్ను వదిలించుకున్నాడు, అతను నిన్ను మోసం చేశాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా జీవితంలాగే నీ జీవితం కూడా నాశనమైంది.. అంటూ శూర్పనక సీతను ఆడిపోసుకుంటుంది. అయితే సీత అందుకు ఏ మాత్రం స్పందించదు. పైగా ముఖంపై చిరునవ్వుతో ఉంటుంది. అనంతరం తన కుటీరంలో ఉన్న కొన్ని పండ్లను శూర్పనకకు తెచ్చి ఇస్తుంది. తరువాత సీత.. నువ్వు పాపం చేశావు కాబట్టే నీకు ఆ శిక్ష పడింది. పాపులకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ఇక నాకు జరిగింది నా కర్మ ఫలితం.
విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకు చింతించకూడదు. మనల్ని అవతలి వారు ప్రేమించకపోయినా సరే మనం మాత్రం ప్రేమించడం ఆపకూడదు. నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జీవించు. లేదంటే నీ కోపమే నిన్ను ఇతరులకు ఆహుతి చేస్తుంది.. అని అంటుంది. దీనికి నిశ్చేష్టురాలైన శూర్పనకకు ఏం చేయాలో అర్థం కాదు. సీత మాటలు అర్థమైనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనంతరం మళ్లీ ఆమె పాత్ర రామాయణంలో రాదు..! ఇదీ.. శూర్పనకకు సంబంధించిన ముగింపు కథ..!