Movies

అజ్ఞాతవాసి కారణంగా ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసిన రేణూ దేశాయ్

జనసేనాని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరో వ్యక్తితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైంది. కొన్నిరోజుల క్రితమే రేణూకు నిశ్చితార్థం అయింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని ఆమె ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అటు పవన్ కూడా రేణూకు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే… ఇలాంటి హ్యాపీ టైమ్ లో కూడా రేణూను కొంత అసంతృప్తి వేధిస్తోంది. ట్విట్టర్ లో అజ్ఞాతవాసులు అధికంగా ఉన్నారని, అలాంటివాళ్లు చేసే నెగెటివ్ ప్రచారం కారణంగా మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎంతో చిరాకుతో నిండిన ఇలాంటి వ్యక్తులు సినిమాల గురించి గానీ, రాజకీయనేతల గురించి కానీ ఎప్పుడూ తప్పుగానే రాస్తుంటారు… ఇప్పుడు నేను ఒక కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నా… ఈ శుభ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చానంటూ తన ట్విట్టర్ అకౌంట్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది రేణూ దేశాయ్.

తద్వారా ద్వేషపూరితమైన వ్యాఖ్యలకు, వ్యతిరేక ప్రచారానికి దూరంగా ఉండదలుచుకున్నానని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా వెంట ఉంటూ నా మంచి కోరుతున్న పత్రికలు, వ్యక్తులకు కృతజ్ఞతలు అంటూ ఫైనల్ ట్వీట్ తో సైనింగ్ ఆఫ్ చెప్పేసింది. రేణూ దేశాయ్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక ట్విట్టర్ లో ఆమెకు ఎదురవుతున్న ట్రోలింగ్ ప్రధానకారణంగా తెలుస్తోంది.

రెండో పెళ్లి చేసుకుంటే చంపేస్తాం… మీరెప్పటికీ పవన్ కల్యాణ్ భార్యే… మీరు మరో పెళ్లి చేసుకోవడం కుదరదు… అంటూ సీరియస్ గా ట్వీట్లు చేస్తుండడంతో రేణూ ఆందోళనకు గురవుతోంది.

ట్విట్టర్ ట్రోలింగ్ కు భయపడే కాబోయే భర్తకు సంబంధించిన ఒక్క విషయం కూడా ఆమె ఇంతవరకు బయటికి వెల్లడించలేదు. తనను ట్రోల్ చేస్తున్న వారిలో చాలామంది అజ్ఞాతవ్యక్తులని, వారి గురించి బయటిప్రపంచానికి తెలిసింది తక్కువని తన ట్వీట్ లో పేర్కొంది రేణూ.