నర్తనశాల సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
NTR Nartanasala Movie : పౌరాణిక చిత్రాలు తీయాలంటే తెలుగు వాళ్ళే తీయగలరన్న నమ్మకం అందరిలో బలంగా ఉంది. ఎందుకంటే లెక్కలేనన్ని పౌరాణిక మూవీస్ తెలుగులో వచ్చాయి. అందులో ప్రధానంగా విదేశీ ప్రసంసలందుకున్న నర్తనశాల సినిమా ఒకటి. భారతంలోని విరాట పర్వాన్ని అపురూప దృశ్య కావ్యంగా మలిచిన సినిమా నర్తనశాల. పాండవులు ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయడానికి విరాటరాజు కొలువులో చేరతారు. మారువేషాల్లో పాండవులు ఇక్కడ ఉంటారు. పాచికలు నేర్పే వ్యక్తిగా ధర్మరాజు, వంటవాడిగా భీముడు, నాట్యం నేర్పే బృహన్నలగా అర్జునుడు, అశ్వశాలలో సేవకులుగా నకుల సహదేవులు, పరిచారికగా ద్రౌపది విరాట్ రాజు కొలువులో తలదాచుకుంటారు.
అప్పటికే మాయాబజార్ లో కృష్ణుడుగా మెప్పించి, తెలుగునాట పూజలందుకుంటున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో బృహన్నల వేషానికి ఒప్పుకోవడం నటనకు, సాహసానికి నిదర్శనం. మొదటి నుంచి పౌరాణిక పాత్రల పట్ల మక్కువ కలిగివుండడం, రామాయణ, మహాభారత, మహాభాగవతం సారాంశాన్ని తెలుసుకుని, అందుకు అనుగుణంగా పాత్రల్లో ఒదిగిపోవడం ఎన్టీఆర్ కి కొట్టినపిండి. కానీ ఈపాత్రలో హొయలు ఒలకబోస్తూ ఉండాలి. అందుకే మొదట్లో ఈ పాత్రకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. నెలరోజులు సమయం తీసుకుని, వెంపటి చినసత్యం దగ్గర నృత్యం నేర్చుకున్నారు. టీవీఎస్ శర్మ చేత మేకప్ వేయించుకుని, తన గురు సమానులైన కెవి రెడ్డి దగ్గరకు వెళ్లి చూపించారు. కెవి రెడ్డి ముగ్దుడవ్వడంతో ఎన్టీఆర్ అప్పుడు ఆ పాత్రకు ఒకే చెప్పారు.
అందగాడైన ఎన్టీఆర్ ఆడ మగా కానీ పాత్రను ఎలా రక్తికట్టిస్తాడని అందరిలోనూ రిలీజ్ వరకూ డౌటే. లక్ష్మీ రాజ్యం మంచి నటిగా పేరు తెచ్చుకుని, శ్రీధరరావుని పెళ్లాడాక రాజ్యం పిక్చర్స్ నెలకొల్పి దాసీ, హరిశ్చంద్ర, కృష్ణలీల వంటి సినిమాలు తీసాక నర్తనశాల ఏమాత్రం ఖర్చుకి వెనకాడకుండా తీశారు. కమలాకర కామేశ్వర రావు దర్శక నిర్దేశకత్వంలో తీశారు. సముద్రాలతో మాటలు రాయించి మణిపూసలా ఈ సినిమాను కమలాకర కామేశ్వరరావు తీర్చిదిద్దారు. ఈ సినిమాలోని జననీ శివకామిని సాంగ్ తెలుగు లోగిళ్లలో మారుమోగింది. బాలమురళీ కృష్ణ ఆలపించిన లలిత రాగ సుధారస సాంగ్, నరవరా కురువరా వంటివి జనరంజకం అయ్యాయి. ఉత్తర గోగ్రహణ ఘట్టంలో తిక్కన్న పద్యాలూ కూడా అలరించాయి.
కాంచనమాల చిన్న వేషం కూడా వేశారు. రావి కొండలరావు అసిస్టెంట్ డైరెక్టర్. ఇక దండమూడి రాజగోపాల్ (భీముడు), నెల్లూరు కాంతారావు(జీమూత మల్లు పాత్ర ) ఇద్దరూ నిజ జీవితంలో మల్లయోధులే. కీచకుని పాత్రలో ఎస్వీఆర్ నటన అద్భుతం. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా, అవార్డు అందుకుంది. జకార్తాలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ విలన్ గా ఎస్వీఆర్ ని ప్రకటించి సత్కరించారు.