MoviesTollywood news in telugu

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి నమ్మలేని నిజాలు మీకోసమే

allu aravind Facts :మెగాస్టార్ చిరంజీవి అనగానే అల్లు అరవింద్ కూడా ఠక్కున గుర్తొస్తారు. బావమరిదిగానే కాదు, ప్రొడ్యూసర్ గా చిరు ఎదుగుదలకు అరవింద్ వేసిన బాటలు అలాంటివిమరి. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అరవింద్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారిపోయారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగులోనే కాదు వివిధ భాషల్లో సినిమాలు తీశారు. మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తెలుగులో ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. తెలుగులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి దాన్ని సక్సెస్ చేసిన ఘనత సాధించారు.

హీరోల్లో మెగాస్టార్ ఎలాగో ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా అలాగే అని చెప్పాలి. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు జన్మించిన అరవింద్ 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత గా ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌‌లో వన్ ఆఫ్ ది సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మెగా ప్రొడ్యూసర్ అయ్యారు. అరవింద్‌‌కు అల్లు అర్జున్, ‘అల్లు వెంకటేష్ (బాబీ), ‘అల్లు శిరీష్ అనే ముగ్గురు కుమారులున్నారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య’ సినిమా నిర్మించి తొలి సినిమా తోనే సక్సెస్ సాధించారు. ఆ తర్వాత మళ్లీ దాసరి దర్శకత్వంలో ‘దేవుడు దిగివస్తే’ సినిమా, ఆ తర్వాత రావు గోపాలరావు ప్రధాన పాత్రలో ‘మా ఊళ్లో మహాశివుడు’ అనే సోషియో ఫాంటసీ సినిమా రూపొందించి మంచి సక్సెస్ ఫార్ములాకు కేరాఫ్ అయ్యారు.

ఇలా తొలి మూడు సినిమాలను వేరే వాళ్లతో నిర్మించిన అల్లు అరవింద్.. తొలిసారి తన చెల్లెలు భర్త అయిన చిరంజీవితో ‘శుభలేఖ చిత్రాన్నిమరో నిర్మాత వి.వి.శాస్త్రీతో కలిసి ప్రశాంతి క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కించాడు. కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌ అయింది. ఆ తర్వాత అల్లు అరవింద్ నేరుగా చిరంజీవితో ‘యమ కింకరుడు’ నిర్మించారు. 1979లో ఇంగ్లీష్‌లో వచ్చిన ‘మ్యాడ్ మాక్స్’ సినిమాను ప్రేరణతో రాజ్ భరత్ దర్శకత్వం తీసిన ఈ మూవీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

ఆ తర్వాత చిరంజీవితో సంయుక్త మూవీస్ వారు తీసిన ఖైదీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో వరుసగా ‘హీరో’, ‘విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, మెకానిక్ అల్లుడు, మాస్టర్, డాడీ, అందరివాడు ఇలా వరుసపెట్టి 16 సినిమాలు తీసిన అల్లు అరవింద్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారు. ఇందులో 12 చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కాయి. ఇక రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ‘మగధీర’లో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు. మొత్తం మీద చిరంజీవితో గీతా ఆర్ట్స్ తీసిన సిన్మాలు 13 గా లెక్కతేలతాయి. ఇక ‘శుభలేఖ’, ‘రౌడీ అల్లుడు’, ‘ఎస్పీ పరశురాం’, ‘అన్నయ్య’ చిత్రాలను వేరే నిర్మాతలతో కలిసి అరవింద్ నిర్మించారు ఇందులో ఎస్పీ పరశురామ్ మాత్రమే నిర్మాతగా వ్యవహరిస్తే.. మిగతా మూడు చిత్రాలకు అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్‌ను ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి అరవింద్ ఎంట్రీ ఇప్పించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘జానీ’ ‘జల్సా’ చిత్రాలను నిర్మించారు. మెగా తనయుడు రామ్ చరణ్‌తో ‘మగధీర’ ‘ధృవ’ నిర్మించారు. ఇక తన కొడుకు అల్లు అర్జున్‌తో ‘బన్ని’ హ్యాపీ’ ‘బద్రినాథ్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలను నిర్మించారు.

అంతేకాదు వేరే నిర్మాతలో కలిసి శ్రీకాంత్ హీరోగా ‘పెళ్లి సందడి’, శ్రీకాంత్, వేణు హీరోలుగా ‘పెళ్లాం ఊరెళితే’ అల్లు అరుణ్ ఎంట్రీ ఇప్పిస్తూ ‘గంగోత్రి’ వంటి చిత్రాలను అరవింద్ నిర్మించారు. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. చిరంజీవి హీరోగా ప్రతిబంధ్, ది జెంటిల్మెన్ సినిమాలతో పాటు ‘కౌన్’, కువారా’, గజినీ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. కన్నడ, తమిళంలలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలను తీశారు. అంతేకాదు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్ సినిమా నిర్మిస్తున్నారు.