Politics

రాహుల్‌ గాంధీ.. మాయావ‌తి.. న‌గ్మా లకు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసా?

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి, టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ, న‌టులు, రాజ‌కీయ నాయ‌కులు నగ్మా వంటివారు పెళ్ళికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయాలు ఎంత ఆస‌క్తిక‌రంగా మారాయో, ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న కొంద‌రు ప్ర‌ముఖులు వివాహ జీవితానికి దూరంగా ఉన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. వారు పెళ్లి మాట ఎత్తితేచాలు దూరంగా పారిపోవ‌డ‌మో.. అడిగిన‌వారి గూబ గుయ్యిమ‌నేలా స‌మాధానం చెప్ప‌డ‌మో చేస్తున్నారు. అయితే అందుకు వాళ్ళు చెప్పే కారణాలు వింటే దిమ్మతిరుగుద్ది.

బెంగాల్ బెబ్బులి, దీదీ.. ఏ పేరుతో పిలిచినా అది మ‌మ‌తా బెన‌ర్జీ అని యిట్టె అర్ధం అవుతుంది. ఆమె కూడా ఇప్ప‌టికీ బ్ర‌హ్మ‌చారే. ఆమె త‌న పెళ్లి గురించి ఎక్క‌డా నేరుగా స్పందించలేదు. అఫ్‌కోర్స్ ఆమెను డైరెక్ట్‌గా ఈ విష‌యం అడ‌గ‌గ‌లిగే ధైర్యం ఎవ్వరికీ లేనేలేదు. కానీ.. మ‌మ‌తా బెన‌ర్జీ ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌కు త‌న వ్య‌క్తిగ‌త జీవితం క‌న్నా ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని స్పష్టంచేసేసారు.

ఒక‌ప్పుడు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా ప‌లు భాష‌ల్లో సూప‌ర్ స్టార్‌గా వెలుగొందిన హీరోయిన్ నగ్మా ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌గానే ఉన్నారు. గ‌తంలో ఆమె ప‌లువురు హీరోల‌తో డేటింగ్ లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా ఖండించారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీతో ప్రేమ విష‌యాన్ని మాత్రం వెల్లడిస్తూ, 2001లో తాను, సౌరవ్‌ ప్రేమించుకున్నామని చెప్పారు. తన కారణంగా సౌరవ్‌ కెరీర్‌ నష్టపోకూడ‌ద‌ని భావించి ఆయ‌న జీవితంలో నుంచి తప్పుకొన్నానని నగ్మా వెల్ల‌డించారు. ఆ ప్రేమ విఫ‌ల‌మైనందుకే నగ్మా ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదని అంటారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం దేశంలోని రాజ‌కీయ నాయ‌కుల్లో మోస్ట్ ఎలిజిబుల్ అండ్ అవేయిటెడ్ బ్యాచిల‌ర్‌. గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉన్నప్పటికీ ఆయ‌న న‌వ్వుతూ ప‌క్క‌కు త‌ప్పుకుంటూనే ఉన్నారు. అయితే ఓసారి హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తుండ‌గా వారు పెళ్లి గురించి ప్ర‌స్తావించ‌గా.. తాను కాంగ్రెస్‌ పార్టీని పెళ్లి చేసుకున్నాన‌ని అనేసారు. ఇటీవ‌లే ఎన్నికల ప్రచారం సందర్భంగా మహారాష్ట్రలోని పూణేలో విద్యార్థులతో సమావేశం కాగా, వారు రాహుల్ బయోపిక్ తీస్తే హీరోయిన్‌ ఎవరంటూ ప్ర‌శ్నించారు. దీనికి రాహుల్ స‌మాధానం ఇస్తూ.. తాను పనినే ప్రేమిస్తానని, పెళ్లి కూడా దాంతోనేనని చమత్కరించారు.

ఇక బిస్పీ అధినేత్రి మాయావ‌తి ఎందుకు పెళ్లి చేసుకోలేద‌న్నది ఇన్నాళ్లూ పెద్ద ప‌జిల్‌. ఆమె కూడా ఎక్క‌డా నేరుగా ఈ విష‌యంపై స్పందించకున్నప్పటికీ ఇటీవ‌లే సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడ‌విట్‌లో మాత్రం తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పారు. 2009లో మాయావతి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో కాన్షీరాం రూ.2వేల కోట్ల‌తో భారీ ఎత్తున ఏనుగులు, మాయావ‌తి విగ్రహాలను ఏర్పాటు చేయించారు. దీనిపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. మాయావ‌తి ఇటీవ‌లే ఓ అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేశారు. తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసినట్లు తెలిపారు. ప్రజలకోసమే పాటు పడాలనే తపనతో తాను పెళ్లి కూడా చేసుకోలేదని చెప్పారు.