రాత్రికి రాత్రే స్టార్స్ గా మారి అంతే తొందరగా కనుమరుగైన హీరోలు
చిత్రసీమ ఎంత త్వరగా అక్కున చేర్చుకుంటుందో కొన్ని సార్లు అంతే త్వరగా దూరం అవుతుంది. ఎందరో నటులను హీరోలుగా మలిచిన చిత్రసీమ కొందరు హీరోలను మాత్రం కనుమరుగు చేసింది. ఇలా వచ్చి ఒక వెలుగు వెలిగి అంతే త్వరగా చిత్రసీమకు దూరం అయిన నటుల జాబితా ఇది…
తరుణ్
బాలనటుడిగా జాతీయ పురస్కారం.. తరువాత నువ్వే కావాలి.., ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను వరుస హిట్లు లవర్ బాయ్ స్టేటస్. యూత్లో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ అయినా కూడా తరుణ్కు లాంగ్ కెరీర్ తీసుకరాలేకపోయాయి. అనతి కాలంలోనే వెండితెరకు దూరం అయ్యాడు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం దక్కడంలేదు.
వరుణ్ సందేశ్
చిన్న వయసులోనే హీరోగా అవకాశం.. హ్యాపీడేస్ రూపంలో పెద్ద హిట్ ఆ వెంటనే కొత్త బంగారు లోకం అంటూ మరో హిట్తో భవిష్యత్తుకి బంగారు బాట పడింది. ఆ తరువాత ప్లాప్లు మొదలయ్యాయి. 2010 లో వచ్చిన ఏమైంది ఈ వేళ సినిమా ద్వారా మరో హిట్ కానీ ఆ తరువాత ఒక్క హిట్ కూడా లేకుండా కనుమరుగయ్యాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికీ ఈ హీరో వయసు కేవలం 29 మాత్రమే అంటే నమ్మడం కష్టమే. ఇంత చిన్న వయసులోనే జీవితంలో గెలుపు ఓటములు రెండు చూసాడు.
బాలాదిత్య
అనేక సినిమాల్లో బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. తరువాత కథానాయకుడిగా మారి చంటిగాడు, 1940 లో ఒక గ్రామం వంటి సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 1940 లో ఒక గ్రామం సినిమాకు జాతీయ పురస్కారం వచ్చినా కూడా బాలాదిత్య భవిష్యత్తు మాత్రం బాగుపడలేదు. సరైన సినిమాలు లేక అతి తక్కువ కాలంలోనే వెండితెరకు దూరం అయ్యాడు.
ఉదయ్ కిరణ్
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే… బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్.. ఓవర్నైట్ స్టార్డమ్.. లవర్ బాయ్ స్టేటస్.. భవిష్యత్తుకి ఢోకాలేదు అనుకున్నాడు. కానీ ఆ తరువాత జరిగిన పరిస్థితులు ఉదయ్ కిరణ్ జీవితాన్ని చీకటి మాయం చేసాయి. ఎంత వేగంగా చిత్రసీమకు దగ్గరయ్యాడో అంతే వేగంగా వెండితెరకు దూరం అయ్యాడు. చివరకు చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి అనంత దూరాలకు వెళ్ళిపోయాడు.
శివాజీ
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎదిగిన శివాజీ అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించి తప్పుకున్నాడు. ఇప్పుడు శివాజీ దృష్టి అంతా రాజకీయాల మీదికి మళ్లింది.
రాజా
ఈ వెండితెర ఆనంద్ సినిమాలకు స్వస్తి చెప్పి పాస్టర్గా మారాడు. ప్రస్తుతం పాస్టర్గా మత బోధనలు చేసుకుంటున్నాడు.
రోహిత్
జానకి వెడ్స్ శ్రీరామ్, నవ వసంతం వంటి సినిమాల్లో నటించిన రోహిత్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అంతే త్వరగా వెండితెరకు దూరం కావడం కూడా జరిగింది.
ఆకాష్
ఆనందం, పిలుస్తే పలుకుతా వంటి సినిమాల్లో నటించిన ఆకాష్ని ఇప్పుడు ఎవ్వరు పిలవడం లేదు. దీనితో ఇంకా వయసు ఉన్నా కెరీర్ లేకపోవడంతో వెండితెరకు దూరం అయ్యాడు.
వేణు తొట్టెంపూడి
1999 న స్వయంవరం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆరడుగుల ఆజానుబాహుడు వేణు తొట్టెంపూడి. హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా 2013 వరకు కెరీర్ కొనసాగించాడు. కానీ ఆ తరువాత ఎలాంటి అలజడి లేదు.